వైజాగ్ గూగుల్ డేటా సెంటర్పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గత ఏడాది 15 బిలియన్ డాలర్లతో విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాం. ఇది గిగావాట్ స్థాయిలో ఏర్పాటు అవుతుంది. సరికొత్త ప్రపంచ స్థాయి సముద్ర కేబుల్ గేట్వేగా మారుతుంది. కటింగ్ ఎడ్జ్ ఏఐ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. భారత్ లోని అన్ని ప్రాంతాల ప్రజలకు, వ్యాపారవేత్తలకు సేవలు అందుతాయని వివరించారు.
ఇక ఈ ప్రకటనపై ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో వైజాగ్ నగరాన్ని తన అతిపెద్ద AI హబ్గా పేర్కొనడం ఈరోజు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. మాపై ఇంతటి నమ్మకాన్ని ఉంచినందుకు సుందర్ పిచాయ్ కు ధన్యవాదాలు తెలిపారు.