మహారాష్ట్రలో నమోదైన ఒక పరువు నష్టం కేసులో బెయిల్ కు సంబంధించి కొత్త గ్యారెంటీ దాఖలు చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భివండీ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసులో మహారాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ హర్షవర్ధన్ ను తన గ్యారెంటీదారుగా పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు గ్యారంటర్ గా ఉన్న మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ గతేడాది మరణించారు. దీంతో ఆయన స్థానంలో కొత్త గ్యారంటర్ పేరును నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా హాజరయ్యారు. 2014 లోక్ సభ ఎలక్షన్ సందర్భంగా మహారాష్ట్ర లోని సోనాలే గ్రామంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ హత్యలో ఆర్.ఎస్.ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు ఆర్.ఎస్.ఎస్. ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని అప్పట్లో సంఘ్ కార్యకర్త రాజేష్ కుంటే భివండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.