అంతర్జాతీయ వేదికలపై భారత్ చేతిలో ఎప్పుడూ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కు మొట్టికాయలు పడుతూనే ఉంటాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. పాక్ ప్రచారం ఆ వాస్తవాన్ని మార్చలేదని ఆ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలను ఖాళీ చేయాలి. పాక్ ప్రచారం చేస్తోన్న ఉగ్రవాద తీరును జమ్మూకశ్మీర్ ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ నమోదైన రికార్డు స్థాయి ఓటింగే నిదర్శనమని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు అభివృద్ధి, ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన ‘చీనాబ్ బ్రిడ్జ్’ గురించి ప్రస్తావిస్తూ, పాకిస్థాన్ తన ఊహల్లో నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి వాస్తవాలను చూడాలని ఆమె ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ ఐఎంఎఫ్ నుండి పాక్ కోరిన బెయిలౌట్ ప్యాకేజీ కంటే డబుల్ అని అది కూడా వారికి నమ్మశక్యం కాకపోవచ్చని భారత దౌత్యవేత్త చురకలంటించారు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి ఆ దేశం ఉపన్యాసాలు ఇవ్వడం చిత్రంగా ఉందని సెటైర్లు వేశారు.