అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మన బాధ్యత తీరిపోలేదని మహిళల ప్రాధాన్యతను గుర్తించి, బాధ్యతలను అప్పగించడంలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగాయని ఇటువంటి సందర్భంలో చట్టాల బలోపేతం, రక్షణ చర్యలతో పాటు మనల్ని మనం మనుషులుగా సంస్కరించుకుని బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళల భద్రతను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు భావించాలన్నారు. ప్రతి మహిళను మన ఇంటి ఆడబిడ్డగా భావించి, గౌరవించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే అందిస్తున్నట్లు వివరించారు. రేషన్ కార్డుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు మహిళల పేరుతో అందిస్తున్నాం. సోలార్ విద్యుత్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల వరకు మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహిస్తున్న్నామన్నారు. మహిళా శక్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దాలని ‘స్టాండ్ విత్ హర్’ తీసుకున్నట్లు వివరించారు.