తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది రోజున ప్రత్యేకంగా చేసుకునే ఉగాది పచ్చడిలోని షడ్రుచులు కేవలం రుచులు మాత్రమే కాదు, అవి జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే గొప్ప జీవన పాఠాన్ని నేర్పుతాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖపట్నంలో తాజాగా సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మహోత్సవం’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పురస్కారం అందుకున్న ‘విజయ నిర్మాణ్’ అధినేత సూరపనేని విజయకుమార్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించిన సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్, శివగంగ సంగీత పరిషత్, ఆంధ్ర మ్యూజిక్ అకాడెమి వారికి అభినందనలు తెలిపారు. ఈ నూతన ఉగాది నకారాత్మక అంశాలకు పరాభవంగా… సకారాత్మక అంశాలకు ప్రాభవంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. మన కట్టు, బొట్టు, మన భాష, మన యాస, కుటుంబ విలువలను కాపాడుకోవడమే నిజమైన పండుగని తెలిపారు. ప్రకృతిని ప్రేమిస్తూ, కాలాన్ని గౌరవిస్తూ, ‘షేర్ అండ్ కేర్’ అనే భారతీయ తత్త్వంతో అందరం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.