దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలలో పెరుగుదల చోటుచేసుకుంది. అయితే, సామాన్యులు వినియోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించడం ఉపశమనం కలిగించే అంశం. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీఎల్, హెచ్ పీసీఎల్ తమ ప్రీమియం రకం పెట్రోల్ ధరలను లీటర్ కు సుమారు రూ.2 నుండి రూ.2.30 వరకు పెంచాయి. ఈ కొత్త ధరలు నేటి నుండే అమలులోకి వచ్చాయి. ఇక ఈ పెంపు ప్రభావం ప్రధానంగా లగ్జరీ కార్లు, హై-పెర్ఫార్మెన్స్ టూ వీలర్స్ , స్పోర్ట్స్ వెహికల్స్ వాడే వారిపైనే ఉంటుంది. మాములు వెహికల్స్ వాడే రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల పైనే స్థిరంగా కొనసాగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరాపై ఆందోళనలు పెరగడం ఈ పెంపునకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.