అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయారన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.