ఏప్రిల్ నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని స్పష్టం చేశారు. సంజీవని ప్రాజెక్టుపై క్యాంప్ కార్యాలయంలో నేడు సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారిపల్లెలో సమర్ధవంతంగా అమలవుతోన్న ప్రాజెక్టును జూలై నాటికి రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే టార్గెట్ ను అధికారులకు సీఎం నిర్దేశించారు. వైద్య పరీక్షల ఫలితాలను వాట్సప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. ఇక ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్స్ అవసరం కానున్నాయని, రూ.162 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు వివరించారు. ఇందుకు సీఎం అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్ లో నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు పర్సనల్ హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా అన్నారు. భవిష్యత్లో మెడికల్ ఖర్చులు తగ్గేలా సేవలు అందించగలగాలని, ప్రివెంటివ్ హెల్త్పై దృష్టి సారించాలన్నారు. యోగా, న్యూట్రిషన్, మెడిటేషన్, ప్రాణాయామం వంటివి తప్పనిసరిగా ఫాలో కావడంతో చాలా వరకు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో పబ్లిక్ హెల్త్ ఏమేరకు మెరుగయ్యిందో పరిశీలించాలని సూచించారు. ఇక త్వరలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ తీసుకురావాలని చెప్పారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని… ఈ 5 అంశాలతో త్వరలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ తీసుకురావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.