బెంగాల్ ఎన్నికల ముంగిట భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రాజకీయాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నేడు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో ఆయన కాషాయ గూటికి చేరారు. పేస్ గతంలో (2021లో) తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో చేరారు. అయితే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా లేదా పోటీ చేస్తారా అనేది చూడాలి. లియాండర్ పేస్ కేవలం క్రీడాకారుడిగానే కాకుండా, బెంగాల్ తో ఉన్న తన కుటుంబ మూలాల ద్వారా అక్కడి ప్రజల్లో మంచి గుర్తింపు కలిగి ఉన్నారు. ఆయన రాక బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బెంగాల్ లో బీజేపీ-టీఎంసీల మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంది. కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ లో ఏప్రిల్ 23న మొదటి విడత, ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు.