ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం రైల్వేస్టేషన్ కు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధికి సానుకూలంగా స్పందించి, ఆమోదం తెలిపిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు పవన్ స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో మరియు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయని పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి ఇది ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పిఠాపురం, ఈ పథకం ద్వారా ఆధునిక సదుపాయాలతో కూడిన మోడల్ స్టేషన్గా రూపాంతరం చెందడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతిపాదిత అభివృద్ధి పనులు ప్రయాణికుల సౌకర్యాన్ని మరియు ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, మద్దతుగా నిలిచిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి పిఠాపురం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంలో, సీఎం చంద్రబాబు నిరంతర మార్గదర్శకత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల వృద్ధి మరియు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లు పవన్ స్పష్టం చేశారు.