డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఒక ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడం వివాదానికి కారణమైంది. నేడు పిఠాపురంలో పీఎంజేఏవై కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడంపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో సీఎం ఫొటో పెట్టకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘనేనని జనసేన నాయకులను, అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు వర్మ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కల్పించుకుని వర్మపైకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీశారు. ఇరువర్గాల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలకు శాంతింపజేశారు.