తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం నేడు బాధ్యతలు చేపట్టింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది రేపటి విజయానికి నాంది. తిరుగే లేని ప్రగతి ప్రస్థానానికి ముందడుగని పార్టీ పేర్కొంది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. లోకేష్ దిశానిర్దేశనంలో పార్టీ అద్భుత విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదు… అత్యున్నత బాధ్యతని ప్రతిపక్షంలో లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారని ట్రైనింగ్ క్లాసులు మొదలుకుని కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించారని అధినేత చంద్రబాబు కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేషేనని స్పష్టం చేశారు. అందుకే కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఎవరికీ ఊరికే బాధ్యతలు అప్పజెప్పనని రాష్ట్రమే తన కమిట్మెంట్ అని అలాంటి రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడతారో వారిని ప్రోత్సహిస్తానని చంద్రబాబు అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఆయన చాంబర్ లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి నారా లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఈరోజు ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజు కావడంతో ఆయన మంత్రి నారా లోకేష్ సమక్షంలో కేక్ కట్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలకు కేక్ తినిపించి మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.