ప్రస్తుతం ఫిల్మ్నగర్లో మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారనే గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా మొదటి పోస్టర్తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచేసింది. ఇక ఈ చిత్రంలో అయ్యప్ప స్వామి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారట. ఈ వార్త అధికారికంగా బయటకు రాకపోయినా.. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం బలంగా వినిపిస్తోంది. కథలో కీలకమైన సమయంలో అయ్యప్ప స్వామి దైవిక రూపంలో ఒక పవర్ఫుల్ ఎపిసోడ్ ఉంటుందని.. ఆ పాత్ర కోసం దర్శకుడు శివ నిర్వాణ ఎన్టీఆర్ ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా కథ ప్రకారం రవితేజ పాత్ర ఒక అయ్యప్ప భక్తుడిగా కనిపించబోతుందట. తండ్రి – కూతురు మధ్య సాగే ఎమోషనల్ జర్నీతో పాటు భక్తి అంశాన్ని కూడా చాలా బలంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు ముందుకు వచ్చినట్లు ఫిల్మ్నగర్లో చర్చ నడుస్తోంది. ఇక రవితేజ – ఎన్టీఆర్ మధ్య కూడా మంచి స్నేహబంధం ఉంది. పలుమార్లు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరూ మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు కావడంతో వీరిద్దరిని ఒకే స్క్రీన్పై చూడాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ ‘ఇరుముడి’లో ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం సినిమా మరో రేంజ్ కు వెళ్లిపోతుంది.
మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో ఎన్టీఆర్కు ఉన్న అనుబంధం కూడా ఈ గాసిప్కు మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. అలాగే మైత్రీ నిర్మాతలతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే చిన్న పాత్ర అయినా కథ నచ్చితే ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ గెస్ట్ రోల్ పై ఇప్పటివరకు చిత్రయూనిట్ గానీ, ఎన్టీఆర్ టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఇది నిజమా? లేక కేవలం గాసిప్ మాత్రమేనా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. జూ.ఎన్టీఆర్ కెరీర్లో ఇది మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్గా మారబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ సినిమాలతో హీరోలను చూపించడంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ను మరింత డిఫరెంట్ అవతార్లో చూపించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.