మస్కట్ లో ఒక మహిళ వేదనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. కుటుంబ పోషణ నిమిత్తం మస్కట్ లో పని చేసేందుకు వెళ్లిన అన్నమయ్య జిల్లా, వాల్మీకిపురం గ్రామానికి చెందిన శ్రీమతి దూదేకుల షెహనాజ్ అనే మహిళ పని ప్రదేశంలో వేధింపులు తట్టుకోలేక సోషల్ మీడియా ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వీడియో సందేశం పంపారు. దీనిపై వేగంగా స్పందించిన ఆయన ఆ మహిళను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేషీ అధికారులకు ఆదేశించారు. భారత విదేశాంగ శాఖ కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయం సంప్రదించింది. అన్నా కాపాడన్నా అంటూ రోదిస్తూ ఆమె పంపిన వీడియో డిప్యూటీ సీఎం ను కదిలించింది. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా హింసిస్తున్నారని ప్రాణాలు పోయేలా ఉన్నాయన్న ఆమె మాటలకు పవన్ చలించిపోయినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించే అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని పవన్ ఆదేశించినట్లు తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు కార్యాలయ సిబ్బంది శ్రీమతి షెహనాజ్ ని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె భర్త ద్వారా ఒమన్ లోని ఏజెంట్ తో మాట్లాడారు. అక్కడ ఎంబసీని, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను కాంటాక్ట్ అయ్యారు. శ్రీమతి షెహనాజ్ ను సాధ్యమైనంత త్వరగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను డిప్యూటీ సీఎం పవన్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.