మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ లు నివాళులు అర్పించారు. ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
కవిత్వాన్ని కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల స్వరంగా మలిచిన ప్రజాకవి శ్రీశ్రీ. సమసమాజ నిర్మాణంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించాలని, దోపిడీ వ్యవస్థలను ధైర్యంగా ప్రశ్నించాలని సూచించిన మహానుభావుడు. “మానవుడే నా మతం” అనే భావజాలాన్ని ప్రతిపాదించిన శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహాకవి స్ఫూర్తిని మనం స్మరించుకుందాం.
వైసీపీ అధినేత జగన్:
అణగారిన వర్గాల వేదనను అక్షర రూపంలో జ్వాలగా మలిచి విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారు. “నేను సైతం.. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను“ అంటూ సామాన్యుల్లోనూ అభ్యుదయ భావాన్ని నింపిన అక్షర శిల్పి శ్రీశ్రీ. నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని ‘మహాప్రస్థానం’తో తట్టి లేపి, చైతన్యాన్ని తీసుకువచ్చిన ప్రజాకవి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.