కెరీర్ ఆరంభం నుండి వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ఇటీవల ‘బైకర్’ తో మంచి విజయాన్ని అందుకున్న నటుడు శర్వానంద్. ప్రస్తుతం ఆయన హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘భోగి’. డింపుల్ హయాతి, అనుపమ పరమేశ్వరన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, నేడు అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. కందుల సులోచనారాణిగా ఆమె ఈ సినిమాలో కనిపించనున్నారు. డైరెక్టర్ సంపత్ నంది సోషల్ మీడియాలో ఈ పాత్రను పరిచయం చేశారు. ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం… మా ‘కందుల సులోచన రాణి’. ప్రకృతి ఒడిలో పెరిగిన బిడ్డ…గంగమ్మకు నెలవు…కందుల వంశపు గర్వకారణం…మరియు #BHOGI చిత్రానికి ప్రాణ సమానం అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగష్టు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి పీరియాడిక్ స్టోరీతో ప్రేక్షకులను అప్పటి రోజులకు తీసుకెళ్లే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో శర్వానంద్ నటన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటోందో ఇప్పటికే పలు సినిమాల్లో చూశాం. ఇక ఈసారి అంతకుమించి ఉండేలా చిత్ర బృందం కృషి చేస్తోంది. 1980,90 దశకాల్లో పాత్రల్లా ఈ సినిమాలో పాత్రలు కనిపిస్తున్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియోకు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.