పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో కార్మికులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు అన్నక్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం పేదలకు స్వయంగా ఆయనే భోజనాన్ని వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్లోనే సీఎం భోజనం చేశారు. 2024లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 207 అన్న క్యాంటీన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 అన్న కాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269కు చేరింది. త్వరలో మరో 5 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడచిన 21 నెలల్లో 8.80 కోట్ల భోజనాలను పేదలకు అందించడం జరిగింది. ప్రతీ రోజూ ఒక్కో అన్న క్యాంటీన్ లో సగటున 1013 మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో పేదలకు భోజన వసతి కోసం రూ.243 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.
