ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా క్యాబినెట్ తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని భావిస్తోంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ, వడ్డెర సంఘాలకు ప్రాధాన్యతాక్రమంలో ఖనిజ లీజుల కేటాయింపులపై చర్చించింది. వడ్డెరల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పెంచడానికి వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయిస్తూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నీరుకొండ ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ, 60 మీటర్ల వరకు అకడమిక్ బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతి సహా పలు అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మార్కాపురం రాయవరం వద్ద జరిగిన బస్ యాక్సిడెంట్ ఘటనపై క్యాబినెట్ లో చర్చ జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. మృతులకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.