మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’కు పార్లమెంట్లో మద్దతుపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు లేఖ రాశారు. 2029 ఎన్నికల నుండే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని లేఖలో కోరారు. మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుందన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.