శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. జిల్లా అధికారులతో కూడా మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న ట్రీట్మెంట్ గురించి ఆరా తీశారు. శ్రీకాకుళం నగరంలో రోడ్ రిపేర్ పనుల కారణంగా మంచినీటి పైపు లైన్లు దెబ్బతిని డయేరియా వ్యాపించిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 65 మంది వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎనిమిది మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. తాగునీటి కాలుష్యం జరగకుండా క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బాధితులకు ధైర్యం చెప్పాలని ఆదేశించారు.