కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని మాజీ మంత్రి కే.టీ.ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ గారు నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్యని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. మహబూబ్ నగర్ లోని దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని మండిపడ్డారు. పదేళ్లపాటు ఆహ్లాద వాతావరణంలో కళకళలాడిన పల్లెలను అన్నిరకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. “పల్లె కన్నీరు పెడుతుందో” అని మరోసారి పాడుకునే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలోని ప్రతి గ్రామం తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని తన పోస్ట్ లో పేర్కొన్నారు.