ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు మహిళలు సుమారు 40కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని ప్రభుత్వం భారం అనుకోకుండా బాధ్యతగా అమలు చేస్తున్నట్లు వివరించారు. దీని వెనుక 48 వేల మంది ఆర్టీసీ సిబ్బంది శ్రమ ఉందన్నారు. టికెట్ల ఆదాయంపైనే ఆధారపడకుండా కార్గో సర్వీసు ద్వారా రూ.200 కోట్లు ఆర్టీసీ ఆర్జించిందని తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో స్త్రీశక్తి పథకంపై ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన సమీక్షించారు. కార్గో ఆదాయంలో ముందు వరుసలో నిలిచిన జిల్లా అధికారులకు వారు ప్రశంసాపత్రం, నగదు పురస్కారాలను అందించారు. అనంతరం విజయవాడ బస్టాండ్ లోని కార్గో సర్వీసు కొత్త భవనాన్నిప్రారంభించారు. ఆర్టీసీ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.