దశాబ్దాలుగా పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కు విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్యను పరిష్కరించిన నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది గ్రామాల్లో పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్చంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న నిధులను నిలిపివేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంతో సంస్థ సేవలకు అంతరాయం కలిగింది. అయితే సంస్థ అందిస్తున్న సేవలను వివరించి, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేయగా… ఆయన చూపిన ప్రత్యేక చొరవతో నేడు అడ్డంకులు తొలగిపోయాయని చంద్రబాబు తెలిపారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిధుల సేకరణకు ఆర్డీటీని కేంద్రం అనుమతించడం ద్వారా నిధుల రాకకు మార్గం సుగమం అయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి… ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాది మంది పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.