ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె దొర నేడు తుదిశ్వాస విడిచారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 1943లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎకనమిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1965లో ఐపీఎస్ లో చేరారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో విశేష కృషి చేశారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో ఆయన చేసిన విశిష్ట సేవలకు ‘పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ’ పురస్కారం దక్కింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా, సీఐడీ హెడ్ గా సర్వీస్ చేశారు. 1996 నవంబర్ లో ఏపీ డీజీపీగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 2002 వరకు ఐదేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు.
ఇక ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె దొర మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్ గారి దగ్గర ఇంటెలిజెన్స్ అధికారిగా, నా హయాంలో రాష్ట్ర డీజీపీగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని చంద్రబాబు ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. నాడు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్ సమస్య పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని కొనియాడారు. హెచ్.జె దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.