హిందూపురం నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి దిశానిర్దేశంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో బాలా మావయ్య ఏర్పాటుచేసిన జాబ్ మేళాలో TCS, Bluespring, CEIL, THSC, Hexaware వంటి 110 ప్రఖ్యాత సంస్థలు పాల్గొన్నాయని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపారు. జాబ్ మేళాకు 5323 మంది హాజరు కాగా, 1903 మంది ఉద్యోగాలకు, మరో 868 మంది తదుపరి దశ ఇంటర్వ్యూలకి ఎంపికయ్యారని వేలాది మంది యువతకు ఉద్యోగ- ఉపాధి అవకాశాలు చూపించిన బాలా మామయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ లోకేష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. మెగా జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలు, నిర్వహణలో పాలుపంచుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.