ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పాతూరు చెరువుకు జలకళ తెచ్చేందుకు స్థానిక ప్రజలు విరాళాలు సేకరించి…జన్మభూమి స్ఫూర్తితో పలుగు పారా పట్టి స్వయంగా పనులు చేపట్టడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రజల పట్టుదల, సంకల్పం, మంచి ఆలోచనకు మద్దతుగా ప్రభుత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంత తాగునీటి సమస్యలకు, సాగునీటి సమస్యకు పరిష్కారం చూపేలా రూ. 34 కోట్లతో అవసరమైన పనులు చేపట్టి సోమశిల కాలువ నుంచి నీటిని తరలిస్తామన్నారు. నీటి భద్రత కోసం స్థానిక వింజమూరు ప్రజలు వేసిన ఒక్క అడుగుకు ప్రజా ప్రభుత్వం వంద అడుగులు ముందుకు వేసి తోడుగా నిలబడుతుందన్నారు. ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయో…ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా నిరూపిద్దాం అని పిలుపునిచ్చారు.