ఆంధ్రుల రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని ఈరోజు లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని స్పష్టం చేశారు. రైతుల త్యాగానికి, ఇది ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం..అజరామరమని రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని భరోసానిచ్చారు. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తో పాటు లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.