నిజమైన నాయకత్వపు పటిమ క్లిష్ట సమయాల్లోనే నిరూపించబడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేను ఎప్పుడూ చెప్పేలాగే, సవాలుతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య స్థిరత్వాన్ని అందిస్తున్న ప్రధాని మోడీ దేశానికి నాయకత్వం వహించడం భారతదేశం చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. పెట్రోల్ మరియు డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నేడు తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా తీసుకున్న నిర్ణయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో మేము ఈ చర్యను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ధరల అస్థిరత నుండి సామాన్యుడిని రక్షించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
అనేక దేశాలు పెరుగుతున్న ఇంధన ధరలతో పౌరులపై భారం మోపుతున్న తరుణంలో, ఎన్డీయే (NDA) ప్రభుత్వం తన అచంచలమైన నిబద్ధతను చాటుకుంటూ, ప్రజలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిందన్నారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడి, ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పౌరులకు ఎంతో అవసరమైన ఉపశమనాన్ని కలిగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ లో చేసిన పోస్ట్ కు చంద్రబాబు ఈ మేరకు స్పందించారు.