విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఖుర్దా డివిజన్ పరిధిలోని ఇచ్చాపురం నుండి పలాస వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం అలుపెరగని పోరాటం చేసి జోన్ ప్రకటన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని ఈ ఏడు కీలక స్టేషన్లు కూడా చేర్చాలని పార్లమెంట్ వేదికగా అలాగే మంత్రిగా పలుమార్లు రైల్వే మంత్రిని కలసి విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. తన ఈ అభ్యర్థనకు కార్యరూపం దాల్చుతూ ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వే బోర్డుకు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ప్రధాని నరేంద్ర మోదీ లకు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం మరియు ఉత్తరాంధ్రలో రైల్వేల అభివృద్ధికి ఈ అవకాశాన్ని మరింతగా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు:
ఇక మరోవైపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ ఆలయ సమీపంలో జాతీయ రహదారి 326A వద్ద జరుగుతున్న ఆర్.ఓ.బి లో స్థానికులు మరియు భక్తుల కోరిక మేరకు నిర్మాణ మార్పులు చేపట్టడం, అందుకు అదనపు నిధులు ₹15కోట్లు జాతీయ రహదారుల సంస్థ మంజూరు చెయ్యడం పట్ల రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మార్పుతో ఆలయ ప్రాముఖ్యత కాపాడేలా, మహా జాతర ఉత్సవాలు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేలా, స్థానికుల రోజువారి కార్యక్రమాలు జరుపుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాలను అనుసంధానం చేసే కీలక ప్రాజెక్టులో నా అభ్యర్ధన మేరకు మార్పులు చేసి అదనపు నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, జాతీయ రహదారుల సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.