3,100 గిరిజన గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ ది అని మార్కెట్ యార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎస్టీ, ఎస్టీ కార్పొరేషన్కు బడ్జెట్లో రూ. 2,730 కోట్లు కేటాయించినట్లు చూపించి, ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖర్చు చేసింది రూ. 50 కోట్లు మాత్రమేనని విమర్శించారు. ఇది కూడా జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించడానికే వాడారన్నారు. ఒక్క ఎస్టీ యువకుడికి, మహిళకు రూపాయి కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. దీన్నిబట్టే ఎస్టీలను కాంగ్రెస్ ఎంత చిన్న చూపు చూస్తుందో అర్థం అవుతుందన్నారు. ఈ రోజు వరకు లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వలేదని ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఒక్క ఎస్సీకి, ఎస్టీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. ఇక కోడంగల్ నియోజకవర్గం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని సద్గురు సంత్ శ్రీ గురు లోకామసంద్ మహరాజ్ దేవస్థానంలో జరుగుతున్న బావోజీ జాతరలో హరీష్ రావు పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు .నిర్వహించారు. ఆయన పర్యటనకు బీ.ఆర్.ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.