ప్రతిష్టాత్మక ఆస్కార్ 98వ వేడుకలో ‘ఇన్ మెమోరియం’ సెగ్మెంట్ లో ప్రపంచవ్యాప్తంగా సినీ రంగం కోసం విశేషంగా కృషి చేసిన ప్రముఖులకు స్మరించుకున్నారు. తమదైన నటనతో ప్రేక్షకులను అలరించి గతేడాది కన్నుమూసిన నటులను ఆస్కార్ నివాళులర్పించింది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో భారత్ నుండి కూడా పలువురు దిగ్గజ నటుల పేర్లను ఆస్కార్ తన వెబ్ సైట్ లో పొందుపరిచింది. ధర్మేంద్ర, కోట శ్రీనివాస రావు, బి.సరోజా దేవి, మనోజ్ కుమార్ వంటి దిగ్గజ నటులు ఉన్నారు.
ధర్మేంద్ర:
బాలీవుడ్ “హీ-మ్యాన్”గా పిలవబడే ధర్మేంద్ర, భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరు. ఐదు దశాబ్దాలకు పైగా ఎన్నో అద్భుత పాత్రలతో ఆకట్టుకున్నారు. ఆయన కెరీర్లో ‘షోలే’ సినిమా ఒక మైలురాయి. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించారు. నవంబర్ 24న మరణించారు.
కోట శ్రీనివాస రావు:
తెలుగు సినిమా ఆల్ టైమ్ విలక్షణ ఉత్తమ నటులలో నటనకు కోట శ్రీనివాస రావు ప్రతీక. ఎటువంటి పాత్రనైనా అలవోకగా తనదైన శైలిలో చేయడంలో ఆయనకు ఆయనే సాటి. విలనిజం పండించాలన్నా, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఆయన కాదు ఆయన పాత్ర మాత్రమే కనిపంచేలా చేయడం ఆయన ప్రత్యేకత. ప్రత్యేకంగా ఆయన సంభాషణలు పలికే తీరు , బాడీ లాంగ్వేజ్ విలక్షణంగా ఉంటాయి. వందలాది సినిమాల్లో నటించిన ఆయనను భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. గతేడాది జులై 13న ఆయన కన్నుమూశారు.
బి.సరోజా దేవి:
కన్నడ, తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా వెలిగిన నటి బి. సరోజా దేవి. అలనాటి దిగ్గజాలు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, ఎం.జి.ఆర్ మరియు శివాజీ గణేషన్ వంటి తో ఆమె నటించి అలరించారు. భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది. జులై 14న కన్నుమూశారు.
మనోజ్ కుమార్:
హిందీ చిత్రసీమలో దేశభక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన తన సినిమాల ద్వారా సామాజిక అంశాలను, దేశభక్తిని అద్భుతంగా చూపించేవారు. భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుతో సత్కరించింది. గతేడాది తుదిశ్వాస విడిచారు.