కలెక్షన్ కింగ్ మోహన్బాబు అనే పేరు తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు… దాదాపు ఐదు దశాబ్దాలుగా వెండితెరపై తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న లెజెండరీ నటుడు ఆయన. హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా… అంతేకాదు నిర్మాతగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు విశేషం. సుమారు 600కు పైగా సినిమాల్లో నటించి, నేటికీ 70 ఏళ్లు దాటిన వయసులోనూ అదే ఉత్సాహం, అదే ఎనర్జీతో ముందుకు సాగడం మోహన్బాబు ప్రత్యేకత. అందుకే ఆయనను ‘కలెక్షన్ కింగ్’గా అభిమానులు గౌరవంగా పిలుస్తారు. చాలా కాలం తర్వాత మోహన్బాబు మళ్లీ పూర్తి స్థాయి ప్రతినాయక పాత్రలో కనిపించబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం మోహన్బాబుకు భారీ స్థాయి పారితోషికం అందిందనే వార్తలు సోషల్మీడియాలో వైరల్ కావడం మరో చర్చకు దారితీసింది.
ఈ ప్రాజెక్ట్ పేరు ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై నిర్మాత సుధాకర్ చెరుకూరి దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని సరసన సోనాలి కులకర్ణి కథానాయికగా నటిస్తుండగా… మోహన్బాబు ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అలాగే రాఘవ్ జుయల్, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్బాబు వంటి పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతిక విభాగంలో అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా, సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నవీన్ నూలీ ఎడిటర్గా, తోట శ్రీనివాస్ సంభాషణ రచయితగా పని చేస్తున్నారు. ఈ సినిమాలో మోహన్బాబు పాత్ర పేరు ‘శికంజ మాలిక్’. సోషల్మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం… ఆయనకు భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్గా చెల్లిస్తున్నారట. ఇది ఆయన కెరీర్లోనే అత్యధిక పారితోషికమని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అధికారికంగా వెల్లడికాలేదు. నిజంగానే మోహన్బాబు ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్నారా? లేక ఇది కేవలం ప్రచారమేనా? అన్నది తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ‘ది ప్యారడైజ్’ సినిమాతో మోహన్బాబు మరోసారి తన శక్తివంతమైన పాత్ర ని చూపించడానికి సిద్ధమవుతున్నారు.