ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల పట్టణంలో ఒక గవర్నమెంట్ మహిళా ఉద్యోగినిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళలపై ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఘటనకు సంబంధించి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా మాచర్లలోని పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు అత్యాచారానికి యత్నించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామని, బాధితురాలిని మెడికల్ టెస్టుల కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించామని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడం కోసం అదనపు ఎస్పీ పర్యవేక్షణలో స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామని, ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఎం కు అధికారులు వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తద్వారా సమాజానికి గట్టి సందేశం ఇవ్వాలని సీఎం పోలీసులకు సూచించారు. మహిళలపై అఘాయాత్యాలకు తెగబడితే అదే వారికి చివరి రోజని పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.