మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కా నగరం సమీపంలో హోతీ రెబల్స్ డ్రోన్ దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సౌదీ అరేబియా ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. మక్కా నగరంతో పాటు జెడ్డా, తైఫ్ ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు. పవిత్ర స్థలాల రక్షణే ధ్యేయంగా సౌదీ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తాజా పరిణామాలు చర్చనీయంశమయ్యాయి.
సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నాయకత్వంలోని ప్రభుత్వం మరియు క్రౌన్ ప్రిన్స్, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలోని యంత్రాంగం భద్రతను పటిష్టం చేశాయి. అబ్దుల్-మాలిక్ అల్-హౌతీ నేతృత్వంలోని హోతీ ఉద్యమ సంస్థకు చెందిన ఒక డ్రోన్ మక్కా సౌత్ ప్రాంతంలో నిషేధిత గగనతలంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. అయితే రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ సకాలంలో స్పందించి ఆ డ్రోన్ను గగనతలంలోనే విజయవంతంగా అడ్డుకొని నిర్వీర్యం చేశాయి. సౌదీ అరేబియాలో ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా సమీపంలో హోతీలు ఈ దాడులు చేయడం మిడిల్ ఈస్ట్ ను కలవరపెడుతోంది. అనేక దేశాలు ఈ దాడిని ఖండించాయి. భారత్ కూడా ఈ దాడిని ఖండించింది. మిడిల్ ఈస్ట్ లో త్వరగా శాంతి స్థాపన జరగాలని ఆకాంక్షించింది.
మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడికి సంబంధించిన మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ భారత అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ:మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా రాజ్యాంగ పరిధిలోని భూభాగంపై దాడి చేయడాన్ని, అలాగే పౌరుల ప్రాణాలకు మరియు మౌలిక సదుపాయాలకు ముప్పు కలిగించే చర్యలను భారతదేశం ఖండిస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మక్కా నగరానికి ఉన్న ప్రత్యేక విశిష్టత దృష్ట్యా ఈ ప్రాంత సమీపంలో జరిగిన సంఘటన అత్యంత ఆందోళనకరమైనదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి మరియు స్థిరత్వం ఉండాలని ఆకాంక్షించారు. ఇక కొన్ని గంటల క్రితం ఒక డ్రోన్ మక్కా వద్ద నిషేధిత ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించికముందే రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ దానిని అడ్డుకొని, నిర్వీర్యం చేశాయి.దాడుల నేపథ్యంలో మక్కా నగరంతోపాటు జెడ్డా, తైఫలో హై అలర్ట్ ప్రకటించారు. మక్కా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి అలర్ట్ ప్రకటించడం ఇదే మొదటిసారి. అయితే తాము సౌదీలోని పలు ప్రాంతాలను లక్ష్యం చేసుకున్నామే గానీ.. మతపరమైన ప్రాంతాలను కాదని హోతీలు తెలిపారు. ఇలాంటి దాడులు మిడిల్ ఈస్ట్ ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ చమురు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.