ట్రంప్ కు ఝలక్.!
న్యూయార్క్లోనూ ఉచిత బస్సు ఎఫెక్ట్..! మేయర్గా తొలి ముస్లిం…
అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లిక్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. స్థానిక ఎన్నికలలో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగరం మేయర్ పదవిని డెమొక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని సొంతం చేసుకున్నారు. నగర మేయర్ గా జోహ్రాన్ మమ్దాని ఎంపికయ్యారు. తల్లి హిందూ, తండ్రి ముస్లిం.. ఎవరీ జోహ్రాన్ మమ్దాని ..?
అమెరికాలో అతిపెద్ద నగరం, ఆ దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన న్యూ యార్క్ నగరానికి తొలిసారి ఓ భారత సంతతి వ్యక్తి మేయర్ కాబోతున్నాడు. 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ ఓటర్ల మన్ననలు పొందారు. జోహ్రాన్ ముస్లిం వారసత్వంపై, ఆయన విధానాలపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ.. న్యూయార్క్ ప్రజలు మాత్రం ఆయనకే పట్టం కట్టారు. 2026 జనవరి 1న ఆయన న్కూయార్క్ మేయర్గా బాధ్యతలు చేపడతారు.ఈ ఎన్నికలలో జోహ్రాన్ మమ్దానీ మాజీ గవర్నర్ ఆండ్రు క్యూమో, రిపబ్లికన్ కర్టిస్ట్ స్లివా ఇద్దరిని ఓడించారు. భారతీయ ఉగాండా మూలాలు ఉన్న ఆయన ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు అంటే ఈ స్థానిక ఎన్నిక డోనాల్డ్ ట్రంప్ కు ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు అతడిని గెలిపించ వద్దని ట్రంప్ పోస్ట్ చేశారు. గత వందేళ్లలో న్యూయార్క్ మేయర్ పదవికి ఎన్నికైన పిన్న వయస్కుడు జోహ్రాన్ కావడం విశేషం.
బోర్డ్ ఆఫ్ ఎలెక్షన్స్ ప్రకారం.. 20 లక్షల మందికిపైగా న్యూయార్క్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటేశారు. 1969 తర్వాత మేయర్ ఎన్నికల్లో నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదే కావడం గమనార్హం. మమ్దానీ తన ప్రచారం అంతటా.. డొనాల్డ్ ట్రంప్ సహా రిపబ్లికన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ట్రంప్ ఆయనపై ‘కమ్యూనిస్ట్’ అనే ముద్ర వేశారు. జోహ్రాన్ గెలిస్తే న్యూయార్క్ను తాను చేజిక్కించుకుంటానని కూడా ట్రంప్ బెదిరించారు. జోహ్రాన్ 2018 నుంచి అమెరికా పౌరుడైనప్పటికీ, న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేయడానికి ఆయనకున్న అర్హతలను ట్రంప్ ప్రశ్నించారు.
ఒకవేళ జోహ్రాన్ మమ్దానీ గెలిస్తే కనీస అవసరాలకు సరిపడిన స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని, న్యూయార్క్ నగరానికి భారీగా నిధుల కేటాయింపు జరగదు అని అర్థం వచ్చేలా ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినప్పటికీ న్యూయార్క్ ప్రజలు అతనికి పట్టం కట్టి ట్రంప్ కు షాక్ ఇచ్చారు. అతి చిన్న వయసులోనే న్యూయార్క్ మేయర్ గా ఎంపికైన వ్యక్తిగా జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించారు.
న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా క్వీన్స్ బరోకు ప్రాతినిధ్యం వహించిన జోహ్రాన్.. ప్రసిడెంట్ ట్రంప్ విధానాలపై ఘాటైన విమర్శలతో ప్రజల్లో పాపులారిటీ సాధించాడు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న వినూత్న ప్రచారం ఆయనను ప్రజలకు చేరువ చేసింది. అద్దెను తగ్గించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, పిల్లల సంరక్షణ వంటి ప్రాతిపాదనలతో ఎన్నికల్లో ర్యాలీల్లో ఆకట్టుకున్నాడు.
మమ్దానిని ఓడించేందుకు అధికార రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. మేయర్ సీటు కోసం స్వయంగా అధ్యక్షుడు రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు, ఈ ఎన్నికకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఏర్పడింది.ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా మమ్దానిని ఓడించేందుకు నగర ఓటర్లను ట్రంప్ ఓ రకంగా హెచ్చిరించే విధంగా ట్వీట్ చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న మమ్దానిని గెలిపిస్తే, నగరానికి కనీస అవసరాలకు సరిపోయేంత నిధులు మాత్రమే ఇస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. ట్రంప్ మాటలను లెక్క చేయని ఓటర్లు మమ్దానిని గెలిపించారు. తద్వారా మమ్దాని న్యూయార్క్ రాజకీయంపై కొత్త చరిత్రను లిఖించారు.
న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్దానీ భారతీయ సినీ డైరెక్టర్ మీరానాయర్ కుమారుడు. ఉగాండా జాతీయుడైన మహమ్మద్ మమ్దానీ, మీరాల సంతానమే జోహ్రాన్ మమ్దానీ. సోషలిస్ట్ భావజాలం ఉన్న అతడు, ప్రస్తుతం భారత్ అంటేనే ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్న ట్రంప్ ని ఢీకొట్టి నిలిచిన భారతీయ సంతతికి చెందిన ముస్లిం మేయర్. ప్రస్తుతం ఇది అమెరికాలో మాత్రమే కాదు ఇండియాలో కూడా ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. మమ్దాని తల్లి ప్రముఖ భారతీయ దర్శకురాలు మీరా నాయర్. అతని తండ్రి మహ్మద్ మమ్దాని ఉగాండ పౌరుడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో మహ్మద్ ప్రొఫెసర్గా పనిచేశారు. మమ్దాని ఉగాండలోని కాంపాలాలో జన్మించారు. అతని 7 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి న్యూయార్క్కు వలస వచ్చారు. 2018లో అతనికి అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్లో చదివి, తరువాత బౌడోయిన్ కళాశాల నుంచి ఆఫ్రికానా స్టడీస్లో డిగ్రీ పూర్తి చేశారు.
అధికారానికి దూరంగా ఉన్న డెమొక్రాట్లకు అనూహ్య విజయాన్ని అందించిన జోహ్రాన్.. చిన్న వయసులో న్యూయార్క్ పీఠాన్ని అధిష్టించబోతున్న వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు. న్యూయార్క్ మేయర్ గా 2026 జనవరి 1 న ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. న్యూయార్క్ మేయర్ గా గెలిచిన ఆయన ప్రజా సంక్షేమం కోసం అందిస్తామని చెప్పిన హామీలే ఆయనను నిలబెట్టింది.
ముఖ్యంగా అత్యంత కీలకమైన ఉచిత సిటీ బస్సు ప్రయాణాల హామీని, నగరంలో అద్దెలను స్థిరీకరిస్తానని, యూనివర్సల్ చైల్డ్ స్కీమ్ అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 2030 నాటికి కనీస వేతనాలను పెంపు చేస్తామని చిరు వ్యాపారుల జీవన వ్యయాలను తగ్గించి, కార్పొరేట్ల పైన, సంపన్నుల పైన పన్నులు పెంచుతామని తెలిపారు.. ఇక ఈ హామీలే నగర ప్రజలను ఆకట్టుకోగా, అన్నింటికంటే మించి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ధైర్యంగా ఎదురై నిలబడటం విశేషం.