ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు దాదాపుగా రెండు నెలలుగా కొనసాగుతున్నాయి. చర్చలు, పరిస్థితి అదిగో ప్రశాంతంగా ఉందనే సరికి తిరిగి మళ్లీ దాడులు ప్రతిదాడులు ఇలా అంతూ పొంతూ ఉందా లేదా అనే సందిగ్దత మధ్య ప్రపంచదేశాలను పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రభావితం చేస్తూ ఈ రచ్చ కొనసాగుతోంది. అమెరికా యుద్ధ అధికార చట్టం ప్రకారం ఇరాన్ పై ఒంటి కాలి మీద లేస్తోన్న ట్రంప్ కు కళ్లెం పడే సమయం దగ్గరకొస్తోంది. అధికార చట్టం ప్రకారం ఇరాన్ విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్ కు కీలక నిబంధనలు అడ్డుపడనున్నాయి. ఇప్పటివరకు చూసుకుంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అధికారికంగా ఏ దేశంపైనా యుద్ధం చేయలేదు. దానికి ప్రధానమైన కారణం చట్టపరమైన నిబంధనలు. యుద్దం ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటు కు మాత్రమే ఉండడం ప్రెసిడెంట్ కు నేరుగా ఆ అధికారం లేదు. అమెరికా ప్రెసిడెంట్ ఏ దేశంపైన తమ సైనిక చర్య చేపట్టాలన్నా అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందకుండా గరిష్టంగా గడువు 60 రోజులు మాత్రమే. ఈ యుద్ధ అధికార చట్టం ప్రకారం ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ తరువాత ఏం చేస్తారనే దానిపై ప్రపంచం చూపు ఉంది. ఇరాన్ తో పోరు మొద లైనప్పటి నుండి చూసుకుంటే ఈ నెల 29కే గడువు ముగిసిపోతుంది. వైట్ హౌస్ నుండి అమెరికా చట్టసభకు అధికారికంగా ఈ విషయం అందిన తేదీ ప్రకారం చూసుకున్న మే ఒకటితో ఈ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ ట్రంప్ తదుపరి చర్యల అంశంపై ఆయన ఏవిధంగా తన వ్యూహాలు తీసుకొస్తారనేది ఆలోచింపజేస్తోంది. ఈ చట్టమే రాజ్యాంగ విరుద్ధమని ఆయన, వైస్ ప్రెసిడెంట్ జె.డి.వాన్స్ అంటున్నారు.శత్రు భూభాగంలోకి తమ సైనిక బలగాలు పంపిన 48 గంటల్లోగా కాంగ్రెస్ కు ఆ విషయాన్ని ప్రెసిడెంట్ తెలియజేయాలి. దానికి దారితీసిన పరిస్థితులు వాటి పరిధి, ఎంతకాలం కొనసాగవచ్చు అనేవి స్పష్టం చేయాలి. 60 రోజుల్లోగా కాంగ్రెస్ ఆమోదం తెలిపి అలా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆథరైజ్ చేయాలి. లేదంటే సైనిక చర్య ఆలోగా ఆగిపోవాలి. ఇక సైనిక చర్యను విరమించి సైనికులను భద్రంగా తిరిగి తెచ్చేందుకని చెప్పి మరో 30 రోజుల గడువు పొందవచ్చు.
ఇంతక ముందు కూడా కొందరు ప్రెసిడెంట్స్ గతంలో ఈ 60 రోజుల గడువు తర్వాతా కూడా సైనిక చర్యలు కొనసాగించారు. ఇరాన్ పై ప్రస్తుతం చేస్తున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంత ఖర్చవు తోంది, అదనంగా ఫండ్స్ కావాలా అనేదీ ట్రంప్ వర్గం ఇప్పటివరకు కాంగ్రెస్ కు చెప్పలేదని తెలుస్తోంది. అయితే పరిస్థితులు చక్కబడే విధంగా ట్రంప్ వెనకడుగు వేస్తారా లేక ఇంకేమైనా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఇరాన్ తో పాటు ప్రపంచాన్నీ ఆలోచించేలా చేస్తోంది.
అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణగాలనేదే ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల పలు దేశాల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతోంది. కొన్ని దేశాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోయి, సామాన్య ప్రజల రవాణా ఖర్చులు భారాన్ని మోయలేకపోతున్నారు. ఇక యుద్ధం కోసం అమెరికా ప్రభుత్వం చేసే భారీ ఖర్చుల వల్ల ఆ దేశంపై ఆర్థిక భారం పెరుగుతుంది, ఇది పరోక్షంగా పౌరుల పన్నులు లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చు. వీటన్నింటికీ మించి, యుద్ధంలో పాల్గొనే అమెరికా సైనికుల కుటుంబాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇలా అన్ని పరిస్థితులను బేరీజు వేసుకుని ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెడతారా తన రూటే సెపరేటు అనే పద్దతిలో ముందుకు సాగుతురా అనేది చూడాల్సి ఉంది.