ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా రసాయన ఎరువుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకంగా 41 వేల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ప్రధానంగా రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం రసాయన ఎరువులపై సబ్సిడీని కొనసాగించడానికి పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా దేశ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టుకు, జైపూర్ మెట్రో రెండో దశకు కూడా ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ మార్కెట్లలో ధరలు పెరిగిన ప్రతిసారీ ఎరువుల రేట్లు పెంచేస్తే రైతులు పెట్టుబడి భారమవుతున్న పరిస్థితుల్లో ఈ ఒడిదుడుకుల నుంచి అన్నదాతను కాపాడటానికే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సబ్సిడీలు ఇస్తూ వస్తోంది. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతులకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ . ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఫాస్ఫాటిక్, పొటాసిక్ ఎరువుల కోసం సుమారు 41వేల 543 కోట్ల భారీ రాయితీని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన ఎరువులు అందుతాయి.