ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా న్యూ ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచి ఈ సీజన్ లో మొదటి విజయాన్ని అందుకుని పాయింట్ల ఖాతా తెరిచింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 70 (45; 4×4, 5×6), జాస్ బట్లర్ 52 (27; 3×4, 5×6), వాషింగ్టన్ సుందర్ 55 (32; 6×4, 2×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా..లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారీ టార్గెట్ ఛేజింగ్ లో ఢిల్లీ కూడా మంచి పోరాటాన్ని కనబరిచింది. నిస్సంకా 41 (24; 6×4, 1×6) ధాటిగా ఆడాడు. కే.ఎల్.రాహుల్ 92 (52; 11×4, 4×6) మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 41 నాటౌట్ (20; 3×4, 3×6) పరుగులతో చివరి వరకు పోరాడాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితిలో కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో మ్యాచ్ ను ఒక్క పరుగు తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్ ఊపిరి పీల్చుకుంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు, ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.