కేంద్రం పైన ప్రధాని మోదీ పైన కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. మోదీ గారు చెప్పారు – “LPG గ్యాస్ సంక్షోభాన్ని కూడా కోవిడ్ లాగే హ్యాండిల్ చేస్తాం అని.నిజంగానే అలాగే చేశారు. ఖచ్చితంగా COVID సమయంలో లాగే శూన్యమైన విధానాలు, భారీ ప్రకటనలు, అయితే భారమంతా పేదలపైనే అంటూ దుయ్యబట్టారు. రోజుకు రూ.500-800 సంపాదించే వలస కూలీలకు వంట గ్యాస్ ఇప్పుడు అందనంత దూరమైందని రాత్రికి ఇంటికి చేరే కార్మికుడి దగ్గర కనీసం పొయ్యి వెలిగించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పట్టణాలు వదిలి, ఊర్ల బాట పడుతున్నారన్నారు. టెక్స్టైల్ మిల్లులు , ఫ్యాక్టరీలకు వెన్నెముక లాంటి కార్మికులే ఈరోజు కుప్పకూలిపోతున్నారన్నారు. టెక్స్టైల్ రంగం ఇప్పటికే ICU లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఊపిరి వదులుతోంది. అసలు ఈ సంక్షోభం ఎక్కడి నుంచి వచ్చింది? దౌత్యపరమైన చర్చల్లో జరిగిన ఆ పొరపాటు వల్ల, దానిని ప్రభుత్వం ఇప్పటికీ అంగీకరించడం లేదని ఆరోపించారు. అహంకారమే విధానంగా మారినప్పుడు – ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, కార్మికులు వలస వెళ్తారు, పరిశ్రమలు నాశనమవుతాయి మరియు దేశం దశాబ్దాల కాలం వెనక్కి నెట్టబడుతుందని విమర్శించారు. ప్రతి సంక్షోభంలోనూ అందరికంటే ముందు పేదవాడే ఎందుకు బలి అవుతున్నాడు? మౌనంగా ఉండకండి. ఇది కేవలం పేదవాడి సమస్య మాత్రమే కాదు, మనందరి ప్రశ్న అని రాహుల్ పేర్కొన్నారు.