దేశం మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. 140 కోట్లకు పైగా ఉన్న డిజిటల్ సెన్సస్ కు సమయం వచ్చేసింది. మే 11 నుండి ఈ మహా యజ్ఞం ప్రారంభం కాబోతోంది. స్వాతంత్య్ర భారత చరిత్రలో తొలిసారిగా జరగబోతున్న డిజిటల్ కులగణన కూడా అంతా డిజిటల్ గానే జరగనుంది. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది..? కులగణనలో మీ వివరాలు ఎలా సేకరిస్తారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. గతంలో జనగణన అంటే ఎన్యుమరేటర్లు పెద్ద పెద్ద రిజిస్టర్లతో మీ ఇంటికి వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. 2026 మే 11 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ జనగణన పూర్తిగా హైటెక్. స్మార్ట్ఫోన్ లేదా ట్యాబ్లలోని ప్రత్యేక యాప్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. సమాచారం నమోదు చేసిన వెంటనే అది కేంద్ర సర్వర్ కు చేరుతుంది. దీనివల్ల గతంలో లాగా ఫలితాల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.అయితే ఈ సారి జనగణనలో అత్యంత కీలకమైన అంశం క్యాస్ట్ సెన్సస్ (కులగణన). స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా దేశవ్యాప్తంగా కులాల వారీగా వివరాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు..? వారి ఆర్థిక పరిస్థితి ఏంటి..? విద్యా స్థాయి ఎలా ఉంది..? అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకే అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ డేటా కీలకం కానుంది. కులగణన ద్వారా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కొత్త ప్రణాళికలు రూపొందించే వీలు ఉంటుంది. వివరాల సేకరణ ఎలా జరుగుతుందనే సందేహం చాలామందిలో ఉంది. ఎన్యుమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై వివరాలు అడుగుతారు. వ్యక్తిగత వివరాలు అంటే పేరు, వయస్సు, విద్య, వృత్తి మరియు ఆదాయం. నివాస వివరాలు అంటే ఇంటి పరిస్థితి, మరుగుదొడ్డి, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు. మీ కులం మరియు ఉపకులం వివరాలు నమోదు చేయ్యాల్సి ఉంటుంది. మీరు ఇచ్చే సమాచారం అత్యంత రహస్యంగా ఉంచబడుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని కేవలం గణాంకాల విశ్లేషణకు మాత్రమే వాడతారు తప్ప, ఏ వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టరట. ఈ డిజిటల్ జనగణన కేవలం ఒక అంకె కాదు.. రాబోయే దశాబ్దం కాలం పాటు దేశ అభివృద్ధికి ఇది ఒక రోడ్ మ్యాప్. రేపటి పథకాలు, బడ్జెట్ కేటాయింపులు అన్నీ ఈ డేటా పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే, మే 11 నుంచి ప్రారంభం కాబోయే ఈ ప్రక్రియలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి. ఖచ్చితమైన వివరాలు అందించి దేశ నిర్మాణంలో తోడ్పడాలని మోడీ సర్కార్ కోరుతుంది.