పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు

Spread the love

వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తాజాగా కీలకమైన విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
శ్రేయాస్ అయ్యర్ 59 నాటౌట్ (36 బంతుల్లో; 5×4, 3×6), ప్రియాన్షు ఆర్య 56 (33; 2×4, 6×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. కూపర్ కాన్లీ 38 (27; 3×4, 2×6) ఆఖర్లో సూర్యాన్ష్ షెడ్గే 21 (8; 2×4, 2×6) కూడా ధాటిగా ఆడడంతో భారీ టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందుంచింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, మాధవ్ తివారీ 2 వికెట్లు, ముఖేష్ కుమార్ ఒక వికెట్ తీశారు.
ఇక టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ కళ్ళు ఇన్నింగ్స్ లో కెప్టెన్ అక్సర్ పటేల్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. 30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మరో ఆటగాడు డేవిడ్ మిల్లర్ 51 (28; 3×4, 4×6) హాఫ్ సెంచరీతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అశుతోష్ శర్మ 24 పరుగులతో పర్వాలేదనిపించాడు. మాధవ్ తివారీ 18 నాటౌట్ మెరుపు షాట్లతో అదరగొట్టాడు. దీంతో ఢిల్లీ మరొక ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ విజయంతో ఆడిన 12 మ్యాచ్ లలో 5 విజయాలు సాధించి టేబుల్ ర్యాంకింగ్స్ లో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇక పంజాబ్ కింగ్స్ ఆడిన 11 మ్యాచ్ లలో 6 విజయాలు ఒక పాయింట్ షేరింగ్ తో 13 పాయింట్లు సాధించి 4వ స్థానంలో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *