అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారిని కాపాడుకోవడంలో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపి ఆ తల్లితండ్రులకు కొండంత అండగా నిలిచారు. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ(SMA TYPE-1) వ్యాధితో బాధపడుతున్న పునర్విక అనే చిన్న పాపకు మంత్రి నారా లోకేష్ చూపిన ప్రత్యేక శ్రద్ధతో పునర్జన్మ లభించింది. ఇంజెక్షన్ ను అమెరికా నుంచి హైదరాబాద్ రప్పించేందుకు మంత్రి లోకేష్ చేసిన సాయంతో ఆ చిన్నారి ప్రాణాలు నిలబడ్డాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రెయిన్ బో పిల్లల హాస్పిటల్ లో ఈ ఉదయం మంత్రి లోకేష్ సమక్షంలో వైద్యులు అమెరికా నుంచి తీసుకువచ్చిన జోల్ జెన్ స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ ను చిన్నారికి ఇచ్చారు. అనంతరం మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది మంది ఆశీస్సులతో పునర్విక ప్రాణాలు కాపాడుకోగలిగామని లోకేష్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. మాటకు కట్టుబడి..ఈరోజు పునర్విక ఇంజెక్షన్ పూర్తయింది.నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి! అంటూ లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. చిన్నారి పునర్విక తరపున ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు దాతలు ఇచ్చిన విరాళాలు రూ.10 కోట్లు కాగా వైద్యానికి ఇంకా అవసరమైన రూ.6 కోట్లను తానే ఇస్తానని లోకేష్ ముందుకు వచ్చి సాయం అందించారు.