మంచిరేవులలో, మూసీ నదీ తీరాన మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ మందిర పునర్ నిర్మాణం దైవ సంకల్పమని ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని పేర్కొన్నారు. ఎనిమిది ఎకరాల్లో రూ.700 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలని చాలా మంది ప్రయత్నించారని అయితే కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదన్నారు. ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తాడని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. మూసీ పరివాహకంలో మతసామరస్యానికి చిహ్నంగా ఒక మసీదు, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించబోతున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మానవ తప్పిదాలను సరిద్దిద్దకపోతే చరిత్ర మనల్ని క్షమించదని మూసీ పరివాహక ప్రజాప్రతినిధులు మూసీ ప్రక్షాళన చెయ్యాల్సిందే అని రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీస్సులతో మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు.