ఆంధ్రప్రదేశ్ విభజన తెలంగాణ ఏర్పాటు అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య నేడు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ మరోసారి విషం చిమ్మిందని మండిపడ్డారు. తెలంగాణ విభజనను భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం మూర్ఖత్వం, ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఎంతో కాలం జరిగిన పోరాటాలు, ప్రజల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, వారి త్యాగాలను అవమానించడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. అదే సభలో ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు తమ తోటి ఎంపీ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలను అడ్డుకోలేకపోవడం, సరిదిద్దలేకపోవడం అత్యంత సిగ్గుచేటని ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనిపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.