తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ జరుగుతుంది. ఈ నెల 19న ఉగాది పర్వదినం సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. మార్చి 20న డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధి స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి యూనిటితో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలు, ఆశయాలు, భవిష్యత్తు లక్ష్యాలను సభలో వివరించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. అంతకముందు శాసనసభ ప్రాంగణంలో “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి గవర్నర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. పునరుద్ధరించిన శాసనమండలి భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు.