తెలంగాణాలో భారీగా ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్ ఫర్స్ జరిగాయి. మొత్తం 45 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో అత్యంత కీలకమైన సాధారణ పరిపాలన శాఖ బాధ్యతలను రాహుల్ బొజ్జాకు అప్పగించారు. ఆయన జీఏడీ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తూనే, బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలను కూడా చూడనున్నారు. సీనియర్ అధికారుల బాధ్యతల్లోనూ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఆర్థిక మరియు ప్రణాళికా విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్, దేవాలయాల పర్యవేక్షణ బాధ్యతను ఎం. హనుమంతరావు నిర్వహించనున్నారు. ప్రజల సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’ రాష్ట్ర నోడల్ అధికారిగా డి. దివ్యను నియమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త కలెక్టర్గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు.