తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భారత ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు సుబ్రమణియన్ పలు కీలక సూచనలు చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ విభాగాల్లో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనా, తదితర అంశాలపై సుబ్రమణియన్ తో చర్చించారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకుని ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారని పేర్కొంది.