మూసీ పునరుజ్జీవం ఇప్పుడు ఛారిత్రక అవసరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. “MUSI INVITES” పేరుతో కార్యక్రమం నిర్వహించి మా ఆలోచనను సమాజం ముందు పెట్టామన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలను నొప్పించి, పేదలను ఇబ్బంది పెట్టి ఏ పని చేయదని స్పష్టం చేశారు. ప్రతి అభివృద్ధి వెనుక కొంత మందికి ఇబ్బంది కలగడం సహజమని ఆ ఇబ్బందులకు పరిష్కారం చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆ పరిష్కారం పై ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధమని తెలిపారు. మూసీ పరీవాహకంలో మురికి వాడల్లో పేదలు ఆత్మగౌరవాన్ని వదులుకుని బతకాలా!? అని ప్రశ్నించారు. వారు స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించాలన్నది ఆకాంక్షని పేర్కొన్నారు. నది పునరుజ్జీవనంతో పాటు, పేదలకు ఆత్మగౌరవంతో కూడిన పునరావాసం కల్పించడానికి సిద్ధం గా ఉన్నట్లు తెలిపారు.
మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని అధికారాన్ని కాపలాదారుగా వినియోగిస్తాం తప్ప, ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి కాదు అనేది మా ప్రభుత్వం నమ్ముతుందని పేర్కొన్నారు. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్ కు ప్రణాళికలు వేసుకోవడం విజ్ఞుల లక్షణం. మూసీ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని పిలుపునిచ్చారు. “మూసీ పునరుజ్జీవం – రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్” ప్రాజెక్టుపై కొందరు వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.