తమ నిజాయితీతో మనసులను గెలుచుకోవడం మాత్రమే కాకుండా సమాజంలో స్ఫూర్తిని కూడా కలిగిస్తుంటారు. ఇటీవలే చెన్నైలో ఒక పారిశుధ్య కార్మికురాలు ఒక వ్యక్తి పోగొట్టుకున్న నగలను అప్పగించి సీఎం స్థాయి వ్యక్తి మన్ననలు పొందిన ఘటనను చూశాం. తాజాగా అటువంటి ఘటన హర్యానాలో జరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన స్క్రాప్ డీలర్ అనుకోకుండా తన వద్దకు వచ్చిన రూ.15 లక్షల విలువైన బంగారాన్ని తిరిగి అప్పగించి తన మంచి మనసును చాటుకున్నాడు. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా నగరానికి చెందిన అశోక్ తన ఇంటిని మొత్తం శుభ్రం చేసి చెత్తను స్థానిక స్క్రాప్ డీలర్ హాజీ అక్తర్ కు విక్రయించాడు. అనుకోకుండా ఈ చెత్తలోనే 10 తులాల బంగారం కూడా ఉంది. దీనిని అశోక్, స్క్రాప్ కొనుగోలుదారు ఎవరూ చూసుకోలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో అశోక్ కుటుంబం స్క్రాప్ కొన్న వ్యక్తిని సంప్రదించింది. వారు వెతికి చూసి బంగారం దొరకకపోవడంతో అశోక్ కుటుంబం నిరాశచెందింది. ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇటీవల స్క్రాప్ డీలర్ చెత్తను వేరు చేస్తున్న సమయంలో బంగారు ఆభరణాలను గుర్తించి వెంటనే వాటిని స్థానిక పోలీసులకు అప్పగించాడు. అలాగే బంగారు నగలు పోగొట్టుకున్న అశోక్ గురించి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు అశోక్ కుటుంబాన్ని పిలిపించి ఆ బంగారు నగలు వారికే అప్పగించారు.