ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం ఈరోజు విస్ఫోటనం చెందింది. మలుకులో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతం బద్దలై పొగ బూడిద పైకి ఎగజిమ్ముతోంది. ఇక ఈ అగ్నిపర్వత విస్ఫోటనం ఘటనలో 20 మంది పర్వతాలను అధిరోహించే వ్యక్తులు కూడా గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. వారిలో ముగ్గురు మరణించారని తెలుస్తోంది. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన సమయంలో కొందరు విదేశీయులతో సహా 20 మంది ట్రెక్కర్స్ మౌంటెన్ పై ఉన్నారన్నారని స్థానికులు, అధికారులు చెబుతున్నారు. వారిలో ఏడుగురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అక్కడ మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. విస్ఫోటనం కొనసాగుతున్నందున చుట్టూ ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కి.మీ. ఎత్తుకు మందపాటి బూడిద ఎగసిపడి సమీప గ్రామాలను కప్పివేసినట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ PVMBG అధికారులు తెలిపారు. దీంతో సమీప ప్రాంతాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌంట్ డుకోనో అగ్నిపర్వతం మార్చి 29 నుండి యాక్టివ్ గా ఉండడంతో ఎప్పుడైనా విస్ఫోటనం జరిగే అవకాశం ఉందని ఇప్పటికే తాము హెచ్చరికలు జారీ చేసినట్లు జాతీయ విపత్తు నివారణ సంస్థ తెలిపింది.